గర్భిణుల కోసమే న్యూట్రిషన్ కిట్లు

గర్భిణుల కోసమే న్యూట్రిషన్ కిట్లు

రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రారంభమైన కిట్ల పంపిణీ

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వెలుగు : గర్భిణుల కోసమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాల్లో ఇరువురు మంత్రులు వేర్వేరుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్లు, జడ్జిలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచిందన్నారు. గర్భం దాల్చింది మొదలు డెలివరీ అయ్యే వరకు ప్రభుత్వమే అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పోషకాహారంతో పాటు ఆర్థిక సాయం కూడా అందజేస్తుందన్నారు. పుట్టిన తర్వాత కూడా కేసీఆర్ కిట్లు అందజేస్తున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా ఈ రెండు జిల్లాలో ప్రారంభించామని, త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ పంపిణీ చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్లు భవేశ్​మిశ్రా, కృష్ణ ఆదిత్య, పీవో అంకిత్, అడిషనల్​కలెక్టర్‌ వైవీ గణేశ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

ములుగు : ములుగు జిల్లాలో న్యూట్రిషన్​కిట్ల పంపిణీకి వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్.. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో రూ.85లక్షలతో నిర్మిస్తున్న బీసీ హాస్టల్ ప్రహరీ, రూ.కోటి 50లక్షలతో చేపడుతున్న టాలెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, లైబ్రరీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

సైనిక్​స్కూల్​లో ఎథ్ నోవా వేడుకలు

నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా ఖానా పూర్ మండలం అశోక్ నగర్ గిరిజన రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ లో బుధవారం ఎథ్ నోవా–2022 వేడుకలు ప్రారంభయ్యాయి. చీఫ్ గెస్టులుగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, వరంగల్ కలెక్టర్ డా.గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందిస్తోందని, తెలంగాణ రాకముందు 91 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే, తెలంగాణ వచ్చాక వాటి సంఖ్య 186కు చేరిందన్నారు. ఈ సైనిక్ స్కూల్ లో అదనపు గదుల కోసం మంత్రి రూ. 15లక్షలు, ఎమ్మెల్యే రూ.10లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జడ్పీ చైర్ పర్సన్​ గండ్ర జ్యోతి, ఓడీసీఎంఎస్​ చైర్మన్​ గుగులోతు రామస్వామి నాయక్ తదితరులున్నారు.