రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు వేశాం..ఈ నెల 20 వరకు వడ్ల పైసలు

రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు వేశాం..ఈ నెల 20 వరకు వడ్ల పైసలు

హైదరాబాద్‌, వెలుగు: ఈ నెల 20 వరకు వడ్ల కొనుగోళ్లకు సంబంధించి మొత్తం డబ్బులు విడుదల చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌‌ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. ఈ యాసంగిలో గురువారం వరకు 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,264 కోట్ల విలువైన 64.52 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. ఇందులో ఓపీఎంఎస్‌లో నమోదు చేసిన రూ.10,439 కోట్లలో.. రూ.9,168 కోట్లను రైతులకు అందించామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచి ఇప్పటి వరకు 90 శాతానికి పైగా ధాన్యాన్ని సేకరించి, 6,143 కేంద్రాలను మూసేశామన్నారు. 18 జిల్లాల్లో సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లో ఆదివారం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఆలస్యంగా కోతలు ప్రారంభించిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు అన్ని అధికారులు ఇచ్చామని చెప్పారు.