రైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోంది : హరీష్​ రావు

 రైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోంది : హరీష్​ రావు

తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్ధిపేట జెడ్పీ సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే రైతు కల్లాలపై కేంద్రం కయ్యం పెడుతోందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఈజీఏస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు రూ.150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేచీ పెడుతోందని చెప్పారు. 

అంతకుముందు.. సిద్ధిపేటలోని రంగదాంపల్లి రైల్వేస్టేషన్, దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 10కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం మరింత పెంచాలని సూచించారు. కేవలం 5 కిలోమీటర్ల మేర ట్రాక్ చేపట్టాల్సి ఉందని రైల్వే శాఖ అధికారులు మంత్రికి వివరించారు.