క్షమాపణ చెప్పాలి .. రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది : హరీశ్ రావు

క్షమాపణ చెప్పాలి .. రైతులపై కాంగ్రెస్  కక్ష కట్టింది : హరీశ్ రావు
  • అందుకే రైతుబంధుపై  కంప్లయింట్ 
  • రేపు పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా ఆపాలంటరేమో
  • ​ఇప్పుడు రైతుబంధు ఆపినా ఎన్నికల తర్వాత ఇస్తమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:  రైతులపై కాంగ్రెస్ కక్షగట్టిందని, అందుకే రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు​చేసిందని మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతుబంధు కొత్త పథకమేమీ కాదు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.75 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతులపై తన వ్యతిరేకతను కాంగ్రెస్​మరోసారి చాటుకుంది” అని హరీశ్ ఫైర్ అయ్యారు. ‘‘గతంలో ప్రభుత్వాలు రైతుల నుంచి పన్నులు కట్టించుకుంటే.. కేసీఆర్​అదే రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు పంచారు. రైతుబంధు సాయం అందుతున్న 69 లక్షల మంది రైతులు కేసీఆర్​కు అనుకూలంగా ఉన్నారు. ఆ రైతులంతా కాంగ్రెస్ కు ఓట్లు వేయరనే అక్కసుతోనే రైతుబంధు ఆపాలని ఆ పార్టీ నాయకులు ఈసీకి​ఫిర్యాదు చేశారు. రేపు పెన్షన్లు, కేసీఆర్​కిట్లు కూడా ఇవ్వొద్దని.. వాటిని కూడా ఆపేయాలని ఫిర్యాదు చేస్తారేమో” అని విమర్శించారు. రైతుల జోలికి వస్తే కాంగ్రెస్​పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని హెచ్చరించారు.  

కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెడ్తరు.. 

కర్నాటకలో కాంగ్రెస్​ఇచ్చిన డొల్ల హామీలు అమలు కాలేదని హరీశ్ విమర్శించారు. దీనిపై అక్కడి రైతులు కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ‘‘కర్నాటకలో 3 గంటల కరెంట్​కూడా ఇవ్వడం లేదు. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్​తో పాటు రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాం. మాపై కక్షగట్టి రైతుబంధు ఆపాలని చూసిన కాంగ్రెస్​పార్టీకి 69 లక్షల మంది రైతులు కర్రుకాల్చి వాత పెడతారు” అని హెచ్చరించారు. రేపు కాంగ్రెస్​గనుక గెలిస్తే రైతుబంధుకు రాంరాం పెడుతారని, 24 గంటల ఉచిత కరెంట్​ఎత్తేసి 3గంటలు​మాత్రమే ఇస్తారని అన్నారు. ఉమ్మడి ఏపీని 11 సార్లు పాలించిన కాంగ్రెస్.. రైతులకు నయా పైసా ఇవ్వలేదని, కేసీఆర్​కు రెండుసార్లు అవకాశమిస్తే రైతులకు 11 సార్లు రైతుబంధు సాయం ఇచ్చారని తెలిపారు. 

ఇప్పుడు రైతుబంధు ఆగినా.. మళ్లీ మేం వచ్చాక ఇస్తం

రైతుబంధు పథకం సృష్టికర్త కేసీఆరే​అని, ఈ స్కీమ్​ను కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టిం దని హరీశ్ అన్నారు. ‘‘కాంగ్రెస్​దొంగ కంప్లయింట్లతో నెల రోజులు రైతుబంధు ఆగినా.. డిసెంబర్​3 తర్వాత వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే. అప్పుడు ఆగిన స్కీమ్​ను మళ్లీ ప్రారంభిస్తాం. రైతుల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. ఈసీ అనుమతి ఇచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం” అని తెలిపారు. ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు గతంలో సోనియా గాంధీని బలి దేవత, ఇటలీ బొమ్మ అన్నారని.. ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, పటాన్​చెరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్​శంకర్​యాదవ్​మంత్రి హరీశ్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు.