ఖమ్మంలో అమిత్‌‌ షా వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ ఫైర్‌‌‌‌

ఖమ్మంలో అమిత్‌‌ షా వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం సభలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీకి నూకలు చెల్లడం కాదు.. రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నప్పుడే ఇక్కడ బీజేపీకి నూకలు చెల్లిపోయాయని చెప్పారు. ‘‘బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికి తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 

పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే సాగు చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌‌‌‌ను విమర్శించేది. 2జీ, 3జీ, 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి”అంటూ ఆదివారం ట్విట్టర్‌‌‌‌లో మంత్రి సవాల్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసీఆర్ రాజీలేని యోధుడని, అబద్ధపు విమర్శలు, ఔట్ డేటెడ్ ఆరోపణలతో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అమిత్ షా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.