నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకు రూ.66 కోట్ల వ్యయంతో మొదటి విడతగా చేపట్టిన నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూర్ వరకు నాలుగు లేన్ల రహదారి, బట్టర్ ఫ్లై లైట్స్ తో అభివృద్ధి చేపడతామన్నారు. సిద్దిపేట చుట్టూ నలువైపులా నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయన్నారు.  కేసీఆర్ సీఎం అయ్యాకే ఇవన్నీ జరుగుతున్నాయన్న మంత్రి.. రైతుల కోరిక మేరకు రంగనాయక సాగర్ నుండి నీరు వదులుతున్నామని చెప్పారు.

కాళేశ్వరం నీళ్లు ఎకరం భూమి కూడా పారలేదని  కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. - రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే వారికి కండ్లు ఉండి చూడలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఫలితం ఏమిటో మా గ్రామాలకు వచ్చి పారే నీళ్లను చూస్తే తెలుస్తుందని చెప్పారు. రైతులందరికీ నీరందించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.