కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి: హరీశ్​రావు

కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి:  హరీశ్​రావు

నర్సాపూర్, వెలుగు: వ్యవసాయం దండగ అన్న కాంగ్రెస్, సిలిండర్ రేటు పెంచిన బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సునీత రెడ్డిని గెలిపించే బాధ్యత మదన్ రెడ్డిదని.. ఎంపీగా మదన్ రెడ్డి ని గెలిపించే బాధ్యత తమదని కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.  

కాంగ్రెస్ కు11 సార్లు ఛాయిస్ ఇచ్చినా  తెలంగాణను పట్టించుకోలేదని కానీ బీఆర్​ఎస్​ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే నెంబర్​ వన్​ స్థానంలో నిలిపిందన్నారు. నర్సాపూర్ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి ని భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మన్సుర్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జడ్పీటీసీలు రమేష్ గుప్తా, బాబ్యానాయక్, ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్,  సత్యం గౌడ్ పాల్గొన్నారు.