రెండు మూడు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్ 

రెండు మూడు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్ 

రాబోయే రెండు మూడు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లో 28వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. సంగారెడ్డి పట్టణంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 66వేల 400 పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. ఆ తర్వాత జరిగిన పలు అభివృద్ధి  కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు  పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

కేసీఆర్ మాట తప్పే వ్యక్తి కాదని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారని చెప్పారు.  సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమన్న ఆయన...  అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అవేకాకుండా కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు వంటి ఎన్నో పథకాలతో  పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు.

తమది పేదల ప్రభుత్వం అన్న హరీశ్ రావు... బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తమలాంటి పథకాలు అమలు చేస్తున్నారా అని  ప్రశ్నించారు. రూ.45 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా సదాశివ పేటలోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తున్నామని తెలిపారు. సదాశివ పేటలో ప్రస్తుతం  రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి... రానున్న రోజుల్లో రూ.55 కోట్లతో మోరీలు, రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు.