
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఓ ప్రొఫెసర్ విద్యార్ధినులను వేధింపులకు గురి చేసిన విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈ రోజు కళాశాలను సందర్శించిన ఆయన.. ఇలాంటి పేరున్న కళాశాలకు కొంత మంది వల్ల చెడ్డపేరు రావటం బాధాకరమన్నారు. వేధింపులకు గురి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాల గురించి ప్రస్తావిస్తూ.. తులసి వనంలో గంజాయి మొక్కల్లాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అతన్ని తక్షణమే విధుల్లోంచి తొలగించామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, కళాశాలకు ప్రత్యేకంగా ఓ మహిళా ఎస్సైని నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.రేపటి నుంచే మహిళ ఎస్పై విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశం ఇచ్చామన్నారు.
వేధింపులకు పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన మహిళా వార్డెన్ కు మంత్రి ఇంద్రకరణ్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు మనోధైర్యం, ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్ళాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటకు పంపుతారంటూ మంత్రి మండిపడ్డారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరి భాద్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు.