సూర్యాపేట: సభ పేరుతో కాంగ్రెస్ నాయకులు డ్రామాలాడుతున్నారని, ప్రజల్లో ఆదరణ లేని కాంగ్రెస్ ఎక్కడ సభలు పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్ చేశారు. రాహుల్ సభకు ప్రజలు రారన్న బాధతోనే మీడియాలో సెన్సేషన్ కోసం కాంగ్రెస్ నాయకులు కొత్త నాటకానికి తెరదీశారన్నారు. రాహుల్ గాందీ ఓయూ అంశంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వెనుకబాటుకి కారణమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారన్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది ఎవరో ప్రజలకు తెలసునని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతూ హడావుడి చేస్తున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో కేసీఆర్ రైతుల పాలిట దైవంగా మారారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ భయపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు సభ, రాహుల్ ఓయూ పర్యటన అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు... ఇవాళ సభలు, పర్యటనలు అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ పాలనను వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని, వచ్చేసారి కూడా తమదే అధికారమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం...