అభివృద్ధి మీద చర్చకు ఎక్కడకు రావడానికైనా సిద్దమే

అభివృద్ధి మీద చర్చకు ఎక్కడకు రావడానికైనా సిద్దమే

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని, ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలలు కంటున్నారని.. ఆ కలలన్నీ పగటి కలలుగా ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్వాంగుల మరియు వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలు, ట్రై సైకిల్స్, లాప్‎టాప్‎లతో పాటు 4జి ఫోన్‎లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివ్వాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే వికలాంగులకు రూ. 1500 ఫించన్.. రెండోసారి అధికారంలోకి రాగానే రూ. 3000లకు పెంచిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‎కే దక్కుతుందన్నారు. అంగ వైకల్యాన్ని అధిగమించి అందరితో సమానంగా అన్ని రంగాలలో పోటీపడేలా వారిని మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. ఇటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ఆయన కాంగ్రెస్, బీజేపీలను సూటిగా ప్రశ్నించారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‎లో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలులో లేవన్నారు. 

కేసీఆర్ విజన్‎కు బీజేపీ 100 మైళ్ళ దూరంలో ఉంది
మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు...అభివృద్ధి జరుగదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‎కు బీజేపీ 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. ఆ దూరాన్ని బీజేపీ అందుకోవడం ముమ్మాటికీ గగనకుసుమమేనన్నారు. గుజరాత్‎లో 25 ఏండ్ల పాలనలో ఇంటింటికి మంచినీరు అందించలేని వారు ఇక దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తారని జగదీష్ రెడ్డి నిలదీశారు. మోడీ పాలనలో అభివృద్ధి జరగదు... సంక్షేమం ఉండదు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కరలేదు అని ఆయన అన్నారు. అభివృద్ధి మీద చర్చకు బీజేపీ సిద్ధం అనుకుంటే అది ఢిల్లీ అయినా, గాంధీ నగరైనా వచ్చేందుకు తమ పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారన్నారు. కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్, రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా? ఉంటే చెప్పాలంటూ బీజేపీ, కాంగ్రెస్‎లకు ఆయన సవాల్ విసిరారు. రైతుబంధు పేరుతో 14 నుండి 15 వేల కోట్ల రూపాయలు రైతాంగానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. అదే ముఖ్యమంత్రి రైతుల కోసం రూ. 3000 కోట్లతో రైతుభీమా పెట్టింది నిజం కాదా అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్‎దేనని, అంతేకాకుండా రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం కుడా ఆ పార్టీనేనన్నారు. అటువంటి పాపాలను మూటకట్టుకున్నకాంగ్రెస్ పార్టీని ఇప్పటికే జిల్లా ప్రజలు పాతర పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాలలో జెండా ఎగరేసేది టీఆర్ఎస్ పార్టీనేనన్నారు.

 

For More News..

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్

ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడి

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు