
- వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్
- ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్లో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని 44 మంది రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ కోసం గవర్నమెంట్ తోలిన రూ.200 కోట్ల వడ్లను మార్కెట్లో అమ్ముకున్నారని ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను వదిలేప్రసక్తిలేదని క్రిమినల్ కేసులు పెడతామని, ఆర్ఓఆర్ యాక్టు ప్రయోగిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్ల కొనుగోలులో స్టేట్లోనే ఉమ్మడి జిల్లా ముందంజలో ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఫ్రీ ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ అప్పులను భరిస్తూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.
రాజీవ్ యువవికాసం కింద నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రూ.6 వేల కోట్ల సబ్సిడీ ఇస్తామని, రూ.2 వేల కోట్లు బ్యాంక్లు లోన్గా సమకూర్చనున్నాయన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా భూభారతి అమలు చేసిన మండలాల్లో సక్సెస్ అయిందని జూన్ 3 నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనున్నామన్నారు. ఖరీఫ్ సీజన్కు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో 8.21 లక్షల టన్నుల యాసంగి వడ్ల కొనుగోళ్లు స్టేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వడంతో వరి సాగు పెరిగిందన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ మాట్లాడుతూ పేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సిటీలోని స్లమ్ ఏరియాల్లో నివాసముంటున్న పేదలకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అర్బన్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పక్షపాతం చూపుతున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలమవుతున్నాయని రిపేర్లకు ఫండ్స్ కేటాయించాలన్నారు. రివ్యూలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, డాక్టర్ భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కోఆపరేటీవ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు.
కార్యకర్తలకు పదవులు ఇవ్వటమే లక్ష్యం
కామారెడ్డి, వెలుగు : ఇన్ని రోజులు కార్యకర్తలు కష్టపడ్డారని, వారికి పదవులు ఇవ్వటమే తమ లక్ష్యమని రాష్ర్ట ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ పంక్షన్ హాలులో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ బలోపేతాని కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడుతూ చిన్న చిన్న గోడవలు పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. మీటింగ్లో అబ్జర్వర్లు సత్యానారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి
బాన్సువాడ రూరల్, వెలుగు: త్వరగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పాల్గొన్నారు.