నిజామాబాద్ జిల్లాలో 44 రైస్​ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్​ : మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్ జిల్లాలో 44 రైస్​ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్​ : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్​
  • ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్​లో ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని 44 మంది రైస్​ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్​ కోసం గవర్నమెంట్​ తోలిన రూ.200 కోట్ల వడ్లను మార్కెట్​లో అమ్ముకున్నారని ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం  ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను వదిలేప్రసక్తిలేదని క్రిమినల్​ కేసులు పెడతామని, ఆర్​ఓఆర్​ యాక్టు ప్రయోగిస్తామన్నారు.  ఇందిరమ్మ ఇండ్లు, వడ్ల కొనుగోలులో స్టేట్​లోనే ఉమ్మడి జిల్లా ముందంజలో ఉందన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఫ్రీ ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గత బీఆర్ఎస్​ సర్కార్ అప్పులను భరిస్తూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. 

రాజీవ్​ యువవికాసం కింద నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రూ.6 వేల కోట్ల సబ్సిడీ ఇస్తామని, రూ.2 వేల కోట్లు బ్యాంక్​లు లోన్​గా సమకూర్చనున్నాయన్నారు. పైలట్​ ప్రాజెక్ట్​గా భూభారతి అమలు చేసిన మండలాల్లో సక్సెస్​ ​ అయిందని జూన్ 3 నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనున్నామన్నారు. ఖరీఫ్​ సీజన్​కు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టాలన్నారు.  నిజామాబాద్​ జిల్లాలో 8.21 లక్షల టన్నుల యాసంగి వడ్ల కొనుగోళ్లు  స్టేట్​లో ఫస్ట్​ ప్లేస్​లో ఉందన్నారు. సన్నాలకు రూ.500 బోనస్​ ఇవ్వడంతో వరి సాగు పెరిగిందన్నారు.   

 ప్రభుత్వ​ సలహాదారుడు షబ్బీర్​అలీ మాట్లాడుతూ పేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సిటీలోని స్లమ్ ఏరియాల్లో నివాసముంటున్న పేదలకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు.  అర్బన్​లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పక్షపాతం చూపుతున్నారని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు శిథిలమవుతున్నాయని రిపేర్లకు ఫండ్స్​ కేటాయించాలన్నారు.  రివ్యూలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజీవ్​గాంధీ హనుమంతు, ఆశిష్​ సంగ్వాన్​, ఎమ్మెల్యేలు మదన్​మోహన్​రావు, డాక్టర్​ భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​, కోఆపరేటీవ్​ డెవలప్​మెంట్​ లిమిటెడ్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశవేణు పాల్గొన్నారు. 

 కార్యకర్తలకు పదవులు ఇవ్వటమే లక్ష్యం 

 కామారెడ్డి, వెలుగు : ఇన్ని రోజులు కార్యకర్తలు కష్టపడ్డారని, వారికి పదవులు ఇవ్వటమే తమ  లక్ష్యమని రాష్ర్ట ఎక్సైజ్​, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.  గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్​ పంక్షన్​ హాలులో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత, కొత్త అనే  తేడా లేకుండా పార్టీ  బలోపేతాని కృషి చేయాలన్నారు.   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మాట్లాడుతూ చిన్న చిన్న గోడవలు పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. మీటింగ్​లో అబ్జర్వర్లు సత్యానారాయణగౌడ్​,  వేణుగోపాల్​యాదవ్​,  డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.

త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి

బాన్సువాడ రూరల్​, వెలుగు: త్వరగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలో బీర్కూర్, నస్రుల్లాబాద్​ మండలాల మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 
పాల్గొన్నారు.