
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ను ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇంజనీర్ -ఇన్-చీఫ్ (ఆర్&బీ) ఐ.గణపతి రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారుల సమస్యల పరిష్కారం, పలు జాతీయ రహదారుల మంజూరు గురించి చర్చించారు. జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల పదేండ్లుగా వేలాదిమంది అమాయకులు చనిపోయారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల వెంటనే రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ – విజయవాడ ఎన్ హెచ్ –-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ హెచ్-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న ఎన్జీటీ సమస్యకు పరిష్కారాన్ని చూపి, ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. రద్దీతోతీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న ఎన్ హెచ్ –-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని రిక్వెస్ట్ చేశారు.
కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి, పొంగులేటి భేటీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి మరో సారి కేంద్ర కేబినేట్ లో చోటు దక్కించుకున్నందుకు అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సహకారం అందించాలని కోరారు. అయితే, మంత్రుల విజ్ఞప్తిపై స్పందించిన కిషన్ రెడ్డి.. రాష్ట్ర అవసరాల విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.