మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్లయిమాక్స్ కు వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంత్రి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీలో పార్టీ చీఫ్ ఖర్గేతో మీటింగ్ తర్వాత.. హైదరాబాద్ చేరుకున్న మంత్రి రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ కొండా సురేఖ మంత్రి పదవికి స్వయంగా రాజీనామా చేయకపోతే.. ప్రభుత్వమే బర్తరఫ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వమే గవర్నర్ కు బర్తరఫ్ లేఖ రాయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొండా సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుండటం ఆసక్తి పరిణామం.
కొండా సురేఖను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని సురేఖకు ఖర్గే సూచించినట్లు సమచారం.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని కొండా సురేఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం . ఈ క్రమంలోనే సెప్టెంబర్ 3న మధ్యాహ్నం కొండా దంపతులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా పరిణామాలతో సురేఖ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారని ఆసక్తికరంగా మారింది.
