హైదరాబాద్: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం (సెప్టెంబర్ 03, 2026) ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం చంచల్గూడ జూనియర్ కాలేజీలో సీఎం బహిరంగ సభ జరుగుతుంది. పాతబస్తీ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో తెరపడింది. రూ. 620 కోట్లతో సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.
చంచల్గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్నగర్ వరకు ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. మొత్తం 3.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం జరిగింది. 16.61 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం 153.37 కోట్లు ఖర్చు చేసింది. మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫ్లై ఓవర్తో సైదాబాద్ నుంచి సంతోష్నగర్ వరకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది.
►ALSO READ | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 రండి: కేంద్ర మంత్రి రాజ్ నాథ్కు CM రేవంత్ ఆహ్వానం
చంచల్గూడ, ఐఎస్ సదన్, చంపాపేట్, కంచన్బాగ్, మలక్పేట్ ప్రాంతాలకు భారీ ఊరట దక్కనుంది. హైదరాబాద్ నగరంలో మూడో అతిపెద్ద ఫ్లైఓవర్గా సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ నిలిచింది. నగరంలో తొలి స్థానంలో 11.66 కి.మీ పొడవైన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే ఉంది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే 4 లేన్లతో నిర్మించిన సంగతి తెలిసిందే. 4.08 కి.మీ పొడవైన ఆరాంఘర్ ఫ్లైఓవర్ రెండో స్థానంలో నిలిచింది. ఏళ్ల తరబడి ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న పాతబస్తీ ప్రజలకు ఈ సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో భారీ ఊరట దక్కింది.
