జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఏక్స్లెన్స్తో తన అకాడమీ కల నెరవేరిందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా అన్నారు. సోమవారం నగరంలోని మొయినాబాద్ లో సుజాత స్కూల్ లో ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ అకాడమీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్… అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తా కి, తన కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలో లాగా భారత్ లోను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని అన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అనుకుంటున్నానని చెప్పారు. జ్వాల అకాడమీ రన్ చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి అన్నారు.
జ్వాల గుత్తా మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలంపియన్ లను తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. జేసీ అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్లో.. బ్యాడ్మింటన్ తో పాటు స్విమ్మింగ్, క్రికెట్ లను ట్రైనింగ్ అందిస్తామని తెలిపారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బ్యాడ్మింటన్ లొనే స్టార్ గా ఎదిగిన జ్వాల.. తనలాంటి ప్లేయర్లు తీర్చిదిద్దేందుకు అకాడెమీ స్థాపించడం గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత టాలెంట్ ని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.