వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్కాల్కు స్పందించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. వారిని వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం క్రితం పనికోసం ముస్తాబాద్ వచ్చారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వారంతా కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. నడుచుకుంటూ రెండు రోజుల క్రితం పెద్దూరు చేరుకున్నారు. స్థానిక నాయకులు కొందరు వారికి ఆశ్రయం కల్పించి రెండు రోజులుగా వారికి భోజనాలు అందిస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వీరు సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.
దీంతో నిన్న(శుక్రవారం) రాత్రి వారు మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసి తాము పడుతున్న ఇబ్బందులను వినిపించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. కలెక్టర్తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఒడిశా తరలించారు. తమ ఫోన్ కాల్కు స్పందించి వాహనం ఏర్పాటు చేసిన కేటీఆర్ కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.