జీహెచ్ఎంసీ పరిధిలోని బయో డైవర్శిటీ జంక్షన్ దగ్గర మరో ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ తో బయోడైవర్శిటీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్య తీరనుంది. గచ్చి బౌలి నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గనున్నాయి. రూ. 30 కోట్ల 26 లక్షలతో ఫస్ట్ లెవల్ ప్లై ఓవర్ పనులు పూర్తి చేశారు అధికారులు. మూడు లైన్ల ఈ ప్లై ఓవర్ పై ఒకే వైపు వాహనాలను అనుమతిస్తారు అధికారులు.
సెకండ్ లెవల్ వంతెన …గత ఏడాది నవంబర్ 4న అందుబాటులోకి వచ్చింది. వరుస ప్రమాదాలతో కొన్నాళ్లు వంతెనను మూసేసిన అధికారులు…. స్పీడ్ లిమిట్ పెట్టి తిరిగి ప్రారంభించారు. ఇదే చౌరస్తాలో ఇప్పడు ఫస్ట్ లెవల్ వంతెన సిద్ధమైంది. ఇది అందుబాబులోకి రావటంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వారు జంక్షన్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. సిగ్నల్ చిక్కులు లేకుండా రాకపోకలు సాగనున్నాయి.
SRDP ప్యాకేజీ-4లో భాగంగా ఐటీ కారిడార్ లోని పలు జంక్షన్లలో రూ. 379 కోట్లతో వంతెనలు, అండర్ పాస్ ల నిర్మాణ పనులను సర్కార్ ప్రారంభించింది. ఇప్పటికే అయ్యప్ప సోసైటీ జంక్షన్ అండర్ పాస్, మైండ్ స్పేస్ చౌరస్తాలో వంతెన, అండర్ పాస్, రాజీవ్ గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ వంతెన అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే కామినేని కుడివైపు వంతెన, ఎల్బీనగర్ అండర్ పాస్ లు అందుబాటులోకి వస్తాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
