
హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే ఉదాత్త లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును తలపెట్టారన్నారు. మంగళవారం అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద మున్సిపల్ పట్టణాల్లో పనుల పురోగతిని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు. హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలో ఉన్న 141 మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులపై ఆయన సమీక్ష జరిపారు.
గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, టౌన్లకు కొంచెం వేగంగా విస్తరించే స్వభావం ఉంటుంది కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వివిధ టౌన్లలో పనుల పురోగతి ఎలా ఉన్నదని, ఎక్కడన్నా ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయం అవసరమా అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ మిషన్ భగీరథ కింద సరఫరా అవుతున్న నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, దీని కొరకు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, నీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు