మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు

మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన క్రిమిసంహారక ద్రావకం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం గురించి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. పై పనుల కోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ శాఖలో ఉన్న ఉద్యోగులు అందరు విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రేపటికల్లా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో రెండు లేదా మూడు రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.