అప్పుడే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు : కిషన్ రెడ్డి

అప్పుడే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు : కిషన్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్ మాటలు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నారని సెటైర్ వేశారు. 2023, మార్చి 12వ తేదీన కుంభకోణం వెలుగు చూస్తే.. ఇప్పటివరకు మన్ను (మట్టి) తిన్న పాము మాదిరి కేటీఆర్ ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు కిషన్ రెడ్డి చురకలంటించారు. 

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదమన్నారు. లీకేజీ జరిగినప్పుడు తనకేం సంబంధమని కేటీఆర్ వితండవాదం చేసిన మాట వాస్తవం అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఓటమి కూడా ఖాయమని చెప్పారు. ప్రగతి భవన్ నుంచి ఫాంహౌస్ కు కేసీఆర్ కుటుంబం పరిమితం కావటం ఖాయమన్నారు. కేసీఆర్ కు యువతపై నిజంగా ప్రేమ ఉంటే ఎప్పుడో ఉద్యోగాలను భర్తీ చేసేవారని చెప్పారు. కేసీఆర్ సర్కార్ కారణంగానే 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

వరంగల్ కు చెందిన విద్యార్థినీ ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్, వారి ప్రభుత్వానిదే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రవళిక అత్యహత్యను వాడుకోవటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ పరీక్షలు 17 సార్లు వాయిదా పడ్డాయన్నారు. పరీక్షల వాయిదాలో కేసీఆర్ సర్కార్ గిన్నీస్ రికార్డు సాధించిందన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​పథకాన్ని కేసీఆర్ సర్కార్ నీరు గార్చేసిందన్నారు. టీచర్స్, లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని యూనివర్శిటీలు కళావిహీనంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

టికెట్ల విషయంలో పార్టీదే తుది నిర్ణయం అన్నారు.  నవంబర్ ఒకటిన మూడో లిస్ట్ పై పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజాస్వామిక పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అన్ని జిల్లాలలో సమావేశాలు పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబపార్టీ అని, తమది అలా కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ స్వతంత్య్రం లేదన్నారు. ధర్నా చౌక్ కూడా ఎత్తేశారని, చివరకు హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు.

మరోవైపు.. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై కిషన్​ రెడ్డి స్పందించారు.  ఏ అభ్యర్థిపై అయినా దాడి జరగడం మంచి పద్ధతి కాదన్నారు.