దత్తత తీసుకుని ఏం చేయలే.. మళ్లీ అదే చెప్తే నమ్మం

దత్తత తీసుకుని ఏం చేయలే.. మళ్లీ అదే చెప్తే నమ్మం
  • మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన పెద్దమ్మ కాలనీ వాసులు 

శామీర్​పేట, వెలుగు : ‘ఎలక్షన్లప్పుడుమాత్రమే మా గ్రామాలు గుర్తొస్తయ్.దత్తత తీసుకొని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం  చేయలేదు. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తవా’అంటూ  మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిపై శామీర్​పేట పెద్దమ్మకాలనీ వాసులు మండిపడ్డారు. బుధవారం శామీర్​పేట మండలంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. తాను దత్తత తీసుకున్న పెద్దమ్మ కాలనీకి వెళ్లి ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్​లు,తాగు నీటి సరఫరా, సీసీ రోడ్లు, శ్మశానవాటిక, మహిళలకు మూడు వేల పింఛన్, పెద్దమ్మ కాలనీని మోడల్​ కాలనీగా మారుస్తా అని చెప్పారు.

దీంతో మహిళలు ఒక్కసారిగా గత హామీలపై మంత్రిని చుట్టుముట్టి నిలదీశారు. దళిత బంధు,రైతు బంధుపై ప్రశ్నించగా మంత్రి  సమాధానం చెప్పకుండా.. టాపిక్ డైవర్ట్ చేశారు. ఇష్టమొచ్చింది మాట్లాడితే  వినమంటూ మహిళలు మంత్రిని ప్రశ్నిస్తుండగానే  వినిపించుకోకుండా జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ మల్లారెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు.