తమది సంక్షేమ ప్రభుత్వమని అన్ని రంగాలను ఆదుకుంటామని తెలిపారు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న మత్య్సకారుల గురించి మాట్లాడిన ఆయన.. చేపల వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు ఇచ్చే రూ.10 వేలను మే-06వ తేదీన వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా చేపల వేట లేక మత్య్సకారులు ఇబ్బందులు పడ్డారని .. అందుకే సీఎం జగన్ వారికి సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మే -6న 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని తెలిపారు మంత్రి మోపిదేవి.
మత్స్యకారులు వలస వెళ్లకుండా మౌలికసదుపాయాలు కల్పిస్తామని, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు మంత్రి. ఉబ్బాడ, మచిలీపట్నం, నిజాంపట్నంలో మేజర్ ఫిష్పింగ్ హార్బర్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పిన మోపిదేవి.. బుడగుట్లవానిపాలెం, కొత్తపట్నం, బియ్యపుదిబ్బ, జువ్వలదిన్నెలో ఫిష్పింగ్ హార్బర్లు చేస్తామన్నారు. అటు గుజరాత్ నుంచి ఏపీకి వస్తున్న మత్య్సకారులు ఇవాళ రాష్ట్రానికి చేరుకుంటారని .. వారికి క్వారంటైన్ పూర్తయిన తర్వాతే స్వస్థలాలకు పంపుతామని తెలిపారు మంత్రి మోపిదేవి వెంకటరమణ.