వ్యవసాయ రంగం బలోపేతం చేస్తే రాష్ట్రం కూడా బలపడుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని. చెరువులు, కుంటలు, అలుగులు నిండడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కరోనా సమయంలో కూడా యాసంగి రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని… యసంగి ముగియగానే మళ్ళీ పచ్చని పంటలు పండిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతీ రైతు నియంత్రిత వ్యవసాయ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కరోనా వలన రాష్ట్రానికి రావాల్సిన రాబడి రాలేదని.. దాదాపు రూ.50 వేల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. రైతులకు వారి ఖాతాలో రైతు బంధు వేశామని, 25వేల లోపు రుణాలు ఉన్న వారికి రుణమాఫీ కూడా చేశామన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టంగా ఉందని అన్నారు మంత్రి. తెలంగాణ అప్పుల్లేని రాష్ట్రంగా, సుసంపన్నులు అయ్యే తెలంగాణ కావాలని తాము ప్రయత్నాలు చేస్తున్నామని అలానే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందన్నారు. ఆకలి కేకల తెలంగాణ నుండి అన్నపూర్ణ తెలంగాణ మారిందన్నారు . ఆత్మహత్య లు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా సమస్య ఉన్నప్పటికీ ఆ ప్రభావం రాష్ట్ర రైతాంగం మీద పడకుండా ముందుకు పోతున్నామన్నారు.
కొన్ని పత్రికలు తమ ప్రభుత్వంపై బాధ్యత రహితంగా కథనాలు రాస్తున్నాయని.. అది సరికాదని అన్నారు. తాము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని.. దేని ఆధారంగా అలాంటి కథనాలు రాశారో దానికి కారణం ఇవ్వాల్సింది గా కోరుతున్నామన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ రుణాలను ఇప్పటికే ఇచ్చామన్నారు. రూ. 31.936 కోట్ల లోన్ ఇవ్వడానికి తమ బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను అప్పుల ఊబిలో లేకుండా చేస్తున్నామని.. దశలవారీగా వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఓ పత్రిక రాసిన కథనాన్ని ప్రభుత్వ పరంగా ఖండిస్తున్నామని, అవసరమయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.