
గుండాల/ఆళ్లపల్లి, వెలుగు : పేదల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
మొదటి విడుతలో ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. రానున్న మూడున్నర ఎళ్లల్లో రాష్ట్రంలో 20లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడాలని కలెక్టర్ కు స్వయంగా చెప్పారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలమైన ఆళ్లపల్లి మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి వెంట పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్వీ పాటిల్, పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఇల్లెందు డీఎస్పీ చంద్రబాన్, సీఐ రవీందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.