
వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ సిటీని రాష్ట్రంలో రెండో రాజధాని తరహాలో అభివృద్ధి చేసేందుకు రూ.4,962 కోట్లు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ జనాభా, డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ 2040 తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మామునూర్ ఎయిర్పోర్ట్అభివృద్ధికి రూ.205 కోట్లు కేటాయించగా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేశామన్నారు.
గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రూ.80 కోట్లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతోపాటు ఆధునిక సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. భద్రకాళి మాడవీధులు, రాజగోపురాల నిర్మాణం, భద్రకాళి చెరువు పూడికతీత పనులు చేపట్టామన్నారు. గ్రీన్ హెరిటెజ్ పాకాల బయో డైవర్సిటీ పార్కును అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించే చపాటా మిర్చికి జీఐ ట్యాగింగ్ లభించినట్లు వెల్లడించారు. భూభారతి చట్టం పైలెట్ మండలంగా జిల్లాలోని వర్ధన్నపేటను ఎంపిక చేశామన్నారు.
బ్యాంకు లింకేజీ కింద 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యాన్ని మించి రూ.475 కోట్ల రుణాలు మంజూరు చేసి, రికవరీలో వరంగల్ జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డ్ దక్కడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తునన ఇందిరమ్మ ఇండ్లు, జీరో కరెంట్ బిల్లు, మహాలక్ష్మి, రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, భూభారతి చట్టంతో వివిధ పథకాలు, కార్యక్రమాల అభివృద్ధిని వివరించారు. వేడుకల్లో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.