- డబుల్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయండి
- హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లతో సమావేశంలో మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటి పనిని స్టార్ట్ చేయాలని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇండ్లు మంజూరైనా వర్క్ స్టార్ట్ చేయని లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణం తెలుసుకోవాలని.. ఆర్థిక ఇబ్బందులుంటే మహిళా సంఘాల నుంచి లోన్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా శనివారం సెక్రటేరియెట్ నుంచి అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లతో మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, వీటిలో ఈనెల 31లోగా లక్ష ఇండ్లకు గృహప్రవేశాలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇండ్లు మంజూరు చేసినా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయని, అలాంటి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారిని ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇండ్లలో 20 శాతం వరకు ఇప్పటికీ గ్రౌండింగ్ కాలేదని, అలాంటి ఇండ్లను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ లో రెండో దశ ఇండ్లు మంజూరు చేసేనాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇండ్లు కొలిక్కిరావాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు స్థానికంగా ఎస్ హెచ్ జీ మహిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను మార్చి 31 లోపు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.
హౌసింగ్ బోర్డు పరిధిలో 5 వేల రిజిస్ట్రేషన్లు
హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేషన్లను క్లియర్ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించడానికి రాష్ట్ర హౌసింగ్ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ను మంత్రి శనివారం సచివాలయంలో ప్రారంభించారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు.
ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగాల్సిసిన అవసరం ఉండదని, పూర్తి సమాచారం పోర్టల్ లోనే ఉంటుందన్నారు. కేటాయింపుదారులు తమ రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధృవీకరణ, ఇతర లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చన్నారు. డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పౌరులకు సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.
