కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క

 కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క
  • గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తాం: మంత్రి సీతక్క 

హైదరాబాద్, వెలుగు: కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క చెప్పారు. సర్వీస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సమస్యలను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు  కృషిచేస్తానన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నాయకుల సమావేశం జరిగింది. దాదాపు పదివేల మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్​ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై.. వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయిస్తామని ఇదివరకే హామీ ఇచ్చారు. ఈ మేరకు సచివాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. 

పీఆర్, ఆర్డీ సెక్రటరీ లోకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్, డైరెక్టర్ సృజన హాజరై కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు. సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు లేని ఎన్నో షరతులతో పంచాయతీ కార్యదర్శుల విధించి నియామకాలు చేపట్టిందని విమర్శించారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకు కలెక్టర్ బాస్ ఎలాగో పంచాయతీలకు కార్యదర్శులే బాస్‌‌‌‌‌‌‌‌లని, వాళ్లు లేని గ్రామ స్వరాజ్యాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నారు. గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తామన్నారు. 

త్వరలో గ్రామ పాలన అధికారులను నియమిస్తం

జాబ్ చార్ట్ కావాలని, ఫలానా పనులే చేస్తామనే విధానాన్ని కార్యదర్శులు విరమించుకోవాలని సీతక్క సూచించారు. 1,038 మంది ఔట్​ సోర్సింగ్ సెక్రటరీలను జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా చేయాలన్న ప్రతిపాదన, స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయి తొలగించిన 98 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తిరిగి చేర్చుకునే అంశంపై కోర్టులో కేసు నడుస్తోందని, తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలో రెవె న్యూ శాఖలో గ్రామ పాలన అధికారులను రిక్రూట్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవాధ్యక్షుడు సందీప్, కోశాధికారి శేఖర్ గౌడ్.. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.