- ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది
- ప్రజాప్రభుత్వంపై ఇష్టమున్నట్లు
- మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక
తాడ్వాయి, వెలుగు: ప్రియాంక గాంధీ కాలిగోటికి కూడా కల్వకుంట్ల కవిత సరిపోదని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రియాంక గాంధీని తెలంగాణలో అడ్డుకుంటామని కవిత అనడం హేయమైన చర్య. ప్రియాంక కుటుంబం త్యాగాల కుటుంబం. కవిత పార్టీ అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించిన పార్టీ. సోనియగాంధీ కుటుంబాన్ని అనే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు” అని ఆమె మండిపడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో శనివారం మీడియాతో సీతక్క మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ సక్సెస్ను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
‘‘ప్రజాధనంతోటి సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీకు ఉంది. మీ సొంత ఆటల కోసం కోట్లకు తగిలేసే సంస్కృతి మీకు ఉంది. ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్నారు. అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు”అని కవితపై మండిపడ్డారు. ప్రియాంకగాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని అన్నారు.
అక్కసు వెళ్లగక్కుతున్నరు అధికారం పోయిందన్న అక్కసుతోటి బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కారుకూతలు కూస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘మీలెక్క ఇతర త్యాగాల మీద ఐదారుగురు వచ్చి అధికారంలో కూర్చోలేదు..ఇది ప్రజల ప్రభుత్వం. సీఎం రేవంత్రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు” అని కవితను ఆమె హెచ్చరించారు. మహిళలకు తమ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత బస్సు ప్రయణాన్ని ఓర్వలేక ఆటోవాళ్లను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.