పెద్దపల్లిలో వంశీని గెలిపిస్తే.. జెన్కో పవర్ ప్లాంట్ తీసుకొస్తాం: శ్రీధర్ బాబు

పెద్దపల్లిలో వంశీని గెలిపిస్తే.. జెన్కో పవర్ ప్లాంట్ తీసుకొస్తాం: శ్రీధర్ బాబు

పెద్దపల్లిలో గడ్డం వంశీని  గెలిపిస్తే జెన్ కో పవర్  ప్లాంట్ తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే  తాము ఎన్నికల్లో పోటీ చెయ్యబోమంటూ  ఛాలెంజ్ చేశారు.  కాళేశ్వరం కట్టినా కరీంనగర్ ప్రజలకు చుక్కా నీరు రాలేదన్నారు.  ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన కార్యకర్తలకు   మంచి పదవులిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు.

నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని గడ్డం వంశీ రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  ప్రజాసమస్యలే తన సమస్యలుగా వంశీ ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ కు  పంపించాల్సిన అవసరం ఉంది. కొత్త తరానికి మంచి చేయాలనే వంశీ జనంలోకి వచ్చారు.. ఈ ఎలక్షన్  కేవలం వంశీది కాదు..ప్రతీ కార్యకర్తది.  గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలి.  కాకా వెంకటస్వామి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారు. అన్నీ ఆలోచించే  వంశీకి  హైకమాండ్  టికెట్ ఇచ్చింది. ఉపాధి కోసం వంశీ ఓ ప్రణాళికతో ముందుకెళ్తారని శ్రీధర్ బాబు తెలిపారు.

 రామగుండలంలో వంశీకి 70  వేల మెజారిటీ రావాలన్నారు శ్రీధర్ బాబు.  రామగుండానికి ఐటీ హబ్, పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు శ్రీధర్ బాబు.   రాజ్ ఠాకూర్ ఓ మోడల్ ఎమ్మెల్యే..  ప్రజా సమస్యలను  రోజు సీఎం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు.   సింగరేణిలో మరో  7 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు.  సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని కేసీఆర్ చెప్పారు..  కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందన్నారు.  ఓడిన బీఆర్ఎస్  కు ఓపిక ఉండాలి.. ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్  ఇష్టానుసారంగా  దూషిస్తున్నారు. తరుగు పేరుతో నష్టం జరిగితే  కొప్పలు ఈశ్వర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు శ్రీధర్ బాబు.