మంత్రిని పర్సనల్​గా టార్గెట్ ​చేస్తే ఊరుకోం

మంత్రిని పర్సనల్​గా టార్గెట్ ​చేస్తే ఊరుకోం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ర్ట రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ని వ్యక్తిగతంగా టార్గెట్​ చేస్తే చూస్తూ ఊరుకోమని డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్య అన్నారు. ఆయన ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందన్నారు. బుధవారం నగరంలోని మంత్రి క్యాంపు ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన కోరం కనకయ్యను సీఎం కేసీఆర్​జడ్పీ చైర్మన్​గా చేస్తే ఇప్పుడు పొంగులేటి పంచన చేరి ఇష్టారీతిన నడిస్తే సహించేది లేదన్నారు. 

పువ్వాడ అజయ్​కు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఎక్కువ అని, వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎవరు ఎలా రియాక్ట్​అవుతారో తెలియదన్నారు. అభివృద్ధిపై చర్చకు వస్తానంటే దేనికైనా సిద్ధమన్నారు. మమత ఆసుపత్రి పేదలకు నిత్యం వైద్యం అందించే దేవాలయమన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారమే మమత ఆసుపత్రిలో కొంత స్థలం రెగ్యులరైజ్​చేయించుకుంటే దానికి లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్​బచ్చు విజయ్​కుమార్, బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ ఉన్నారు.