మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం: మంత్రి తుమ్మల
  • సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి
  • మిగతా జిల్లాల్లోనూ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్​లోని ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ పామ్ కర్మాగార నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.

 ఖమ్మం జిల్లా కల్లూరుగూడంలో, గద్వాల జిల్లా బీచుపల్లి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పల్లి, ఖమ్మం జిల్లా అంజనాపురం, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ పామ్  ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలలో అధిక దిగుబడినిచ్చే తక్కువ ఆకు నిడివి గల, తక్కువ ఎత్తు పెరిగే మేలైన రకాలను పెంచాలని, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉన్న కంపెనీలతో మాట్లాడి శాస్త్రవేత్తల సూచనలతో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. 

ఆయిల్ ఫెడ్  నర్సరీలలో రానున్న కాలంలో డిమాండుకు తగ్గట్టుగా 10 లక్షల మొక్కలు పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను కాపాడే దిశలో పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో ఎన్ఎంఈఓపీ పథకంలో దేశంలోనే ఆయిల్ ఫెడ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సరైన పురోగతి లేని ప్రైవేట్ ఆయిల్ పామ్ విత్తన కంపెనీలపై తగు చర్యలను తీసుకోవాలని.. వీలైతే ఆ కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. త్వరలోనే కొత్త ఉద్యోగుల నియమాకాలతో ఆయిల్ ఫెడ్​ను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు.

ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు మెమోలు

హైదరాబాద్​లోని ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు సైతం కొంతమంది ఉద్యోగులు విధులకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో విధులకు  రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్యకు సూచించారు. అలాగే, వ్యవసాయశాఖ కింద ఉన్న అన్ని శాఖలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఉద్యోగుల రోజువారీ లైవ్ అప్డేట్ కోసం డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సూచించారు