మహిళా సంఘాల ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మహిళా సంఘాల ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రణాళిక బద్ధంగా డిమాండ్ సృష్టించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలో 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేసిన పరికరాలు, వస్తువుల విక్రయం కూడా వారి ద్వారానే జరగాలనే పట్టుదలతో కలెక్టర్ మహిళా మార్ట్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్​లోని శిల్పారామం వేదికలో అవకాశం కల్పించారని తెలిపారు. ఖమ్మం నగరంలో ప్రయోగాత్మకంగా ఖమ్మం మార్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ముదిగొండ మహిళలు బ్యాగులు తయారు చేశారని, బ్రాండెడ్ షాపుల కంటే చాలా బాగా ఉన్నాయన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా టీ స్టాల్, జీరాక్స్ సెంటర్ మహిళలకు లాభం కలిగేలా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

 అనంతరం మహిళా మార్ట్ ఆవరణలో టీ స్టాల్ ను మంత్రి ప్రారంభించి టీ తాగారు. ఆ తర్వాత ప్రకాశ్​నగర్ 29వ డివిజన్ లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పూనుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో నరసింహా రావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.