
పెనుబల్లి, వెలుగు : అడవిని నరికి ప్రకృతిని నాశనం చేయడం దేశాద్రోహం కంటే ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతంలోని పులి గుండాలప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం పనులను శుక్రవారం ఆయన పరిశీలీంచారు. ఎకో టూరిజం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన వన విహారి బస్సు ను సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ తో ప్రాజెక్టు చరిత్రను మంత్రికి డీఎఫ్వో విక్రమ్ సింగ్ సిద్ధార్థ్ వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 40 ఏండ్ల కింద పులి గుండాల చుట్టుపక్కల గ్రామలకు నీటికరువు ఉండేదని, ప్రాజెక్టు నుంచి ఇక్కడి ప్రజలు స్వయంగా కాల్వ తవ్వుకొని చెరువులు నింపుకొని పంటలు పండించుకునే వాళ్లని గుర్తు చేశారు.
పకృతి అందాలు భవిష్యత్ తరాలు చూసేలా అడవిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అడవి నరకొద్దు అన్నందుకే గతంలో రెండు సార్లు తాను ఓడిపోయానని, తనను మళ్లీ ఓడించినా ఫర్యాలేదు కానీ.. అడవిని మాత్రం నరుకొద్దని, ఒకవేళ నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టూరిజం ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పులి గుండాల ప్రాజెక్టు కు పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేసి, ఎకో టూరిజంగా పులి గుండాలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, ఖమ్మం సీపీ సునీల్ దత్, ఎఫ్డీవో మంజుల, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, తల్లాడ రేంజర్ ఉమ
తదితరులు పాల్గొన్నారు.