వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి : తుమ్మల నాగేశ్వరరావు

 వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి : తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రఘునాథపాలెం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

ఖమ్మం టౌన్, వెలుగు :  వచ్చే పంచాయతీ ఎన్నికల్లో రఘునాథ పాలెం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను గెలిచి సత్తా చాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎన్నికలే కాకుండా, మండల, జిల్లా కమిటీల బలోపేతానికి సమన్వయ కమిటీలు వేశామన్నారు. 

పని చేసే ప్రతి కార్యకర్తకూ పదవులు వస్తాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కులగణన చేస్తే, దాన్ని చూసి దేశంలో మోదీ కుల గణన చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. తాను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని, జిల్లా, మండలంలో రహదారులకు అత్యధిక నిధులు తెచ్చానని గుర్తు చేశారు. తాను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 

పలు పనులకు శంకుస్థాపన 

రఘునాథపాలెం మండలంలో పర్యటించిన మంత్రి తుమ్మల రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కోయచలక జడ్పీహెచ్​ఎస్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రజా పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తుందని, సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 

నాట్ల కంటే ముందే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలను  శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులను, కోయచలక జడ్పీహెచ్​ఎస్​విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్​ అందజేశారు.

చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సాధు రమేశ్​రెడ్డి, మానుకొండ రాధా కిషోర్, దీప్ల నాయక్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.