- ఈ నెలాఖరులో టార్గెట్ పూర్తి చేయాలి
- రేషన్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ రవాణాపై కఠిన చర్యలు
- సివిల్ సప్లయ్స్ అధికారులతో మంత్రి, సీఎస్ వీడీయో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగుః ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్స్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎస్ శాంతికుమారి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఉన్నతాధికారులతో కలిసి సెక్రటేరియెట్ నుంచి జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్, ఎఫ్సీఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణ వేగవంతం చేయాలన్నారు. సివిల్ సప్లయ్స్డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్సీఐకి పెండింగ్లో ఉన్న సీఎంఆర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, డెలివరీలలో జాప్యంపై ఫిర్యాదు చేశారని అన్నారు.
ఈ నెలలో 42లక్షల టన్నుల సీఎంఆర్ ఇవ్వాలె
ఈ నెలాఖరు లోగా నిరుడు వానాకాలానికి సంబంధించి 7.83 లక్షల టన్నులు, నిరుడు యాసంగి సీజన్కు సంబంధించి 35 లక్షల టన్నుల సీఎంఆర్ పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. టార్గెట్ గడువుకు 21 రోజులు మాత్రమే మిగిలి ఉందనీ, మిల్లర్లందరూ మొత్తం 42 లక్షల టన్నులకు పైగా బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు రోజు వారీ టార్గెట్లు పెట్టుకుని సీఎంఆర్ వేగవంతం చేయాలన్నారు.
జాప్యంతో వేల కోట్ల నష్టం
రైతుల నుంచి వడ్ల సేకరణకు సివిల్ సప్లయ్స్ సంస్థ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న విషయాన్ని ఉత్తమ్గుర్తు చేశారు. మిల్లర్లు నాణ్యమైన సీఎంఆర్ను ఎఫ్సీఐకి అందించడంపైనే పెట్టిన ఈ పెట్టుబడి తిరిగిరావడం ఆధారపడి ఉంటుందన్నారు. ఇన్నాళ్ల జాప్యం ఫలితంగా రూ. 58వేల కోట్ల అప్పులు, రూ. 11వేల కోట్ల నష్టాలతో పాటు సంస్థపై ఏటా రూ.3వేల కోట్ల వడ్డీ భారం పడుతోందన్నారు. టైమ్కు సీఎంఆర్ అందివ్వకుండా మిల్లర్లు జాప్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
రేషన్ అక్రమాలపై కఠిన చర్యలు..
రేషన్ బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి రీసైక్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే వార్తలను ప్రస్తావిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిఉత్తమ్కుమార్హెచ్చరించారు. రేషన్ షాపులకు వస్తున్న బియ్యంలోనూ తూకం తక్కువ వస్తున్నాయనే ఫిర్యాదులపై విచారణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రతి జిల్లాలో ఎఫ్సీఐకి అందించాల్సి సీఎంఆర్ టార్గెట్ రీచ్ కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.