కాళేశ్వరం అవినీతి తేలుస్తం : మంత్రి ఉత్తమ్​

కాళేశ్వరం అవినీతి తేలుస్తం : మంత్రి ఉత్తమ్​
  • కాళేశ్వరం అవినీతి తేలుస్తం 
  • ఏ ఏజెన్సీతో విచారణ అనేది త్వరలో డిసైడ్​ చేస్తం :ఉత్తమ్​
  • ఎంపీగా తాను అడిగిన ప్రశ్నలతోనే బీఆర్ఎస్ అప్పులు బయటపడ్డాయని వెల్లడి
  • లోక్​సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మంత్రి
  • కాంగ్రెస్​ అగ్ర నేతలు సోనియా, రాహుల్​తో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలా? లేక రాష్ట్ర ఏజెన్సీలతో విచారణ చేయాలా? అన్నది సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ అంశంలో డిజైన్, అమలు, నిర్వహణ, నిబ్ధతలో లోపాలున్నాయని ఆయన విమర్శించారు. దీనికి జవాబుదారీ ఎవరన్నది తేలుస్తామని, ఇందులో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో అవినీతిని తేల్చి, పారదర్శకంగా ముందుకు వెళ్తామన్నారు. మొదట ఫైనల్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి, తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖలోనూ జవాబుదారీతనం తెస్తామన్నారు. 

గరీభ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రంలో పేదలకు పంచిన బియ్యం నాణ్యత లేకపోవడంతో 90 శాతం రీసైక్లింగ్ అయ్యేవని చెప్పారు. పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లను మరింత పటిష్టం చేసి... రైతులకు మేలు చేస్తామని వెల్లడించారు. ఇరిగేషన్, మిషన్‌‌ భగీరథ వంటి ప్రాజెక్టుల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినా... ఆశించిన ఫలితాలు, ప్రయోజనం రాలేదన్నారు.

ఎంపీగా రాజీనామా...

హుజూర్‌‌నగర్‌‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నకైన నేపథ్యంలో ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి తన లోక్​సభ​సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం పార్లమెంట్ లో లోక్‌‌సభ స్పీకర్‌‌ ఓంబిర్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి... జన్ పథ్10 లో సోనియా, రాహుల్‌‌గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు కల్పించినందుకు అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు

బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, వాస్తవాలను దాచి తెలంగాణను అప్పుల్లో ముంచిందని ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఎంపీగా తాను అడిగిన ప్రశ్నలతోనే కార్పొరేషన్లు, పలు సంస్థల నుంచి బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న అప్పుల వివరాలు బయటకొచ్చాయన్నారు. గత నాలుగున్నరేండ్లలో కార్పొరేషన్ల నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు అప్పు తీసుకుందన్నారు. రూ.67 వేల కోట్ల అప్పులతో రాష్ట్రం ఏర్పడితే.. గత తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ సర్కార్ ఆ అప్పును రూ.4.50 లక్షల కోట్లకు పెంచిందన్నారు. దీంతో ప్రతి తెలంగాణ బిడ్డపై తలసరి అప్పు రూ.20 వేల నుంచి లక్షకు పెరిగిందని ఫైర్ అయ్యారు. 

విద్యుత్‌‌ కొనుగోళ్లకు సంబంధించి రూ.81 వేల కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్‌‌కు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఎంపీగా తెలంగాణకు సంబంధించి ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు, ట్రైబల్ రిజర్వేషన్ల పెంపు, బీబీనగర్ ఏయిమ్స్ నిర్మాణం, ధాన్యం కొనుగోలు, తెలంగాణ బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు చెప్పారు. భారత్– చైనా సెక్యూరిటీ, అదాని– మోదీల బంధంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు.