
సిద్దిపేట: నేను ఇంచార్జ్ గా ఉన్న అన్ని ప్రాంతాలలో గెలిచే వస్తున్నా.. రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గంలో కూడా గెలుస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం (జూన్ 20) మంత్రి వివేక్ మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గ స్థాయి సమస్యలు, నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలని.. గ్రూప్ రాజకీయాల చేయొద్దని సూచించారు. త్యాగాలు లేకుండా ఫలితాలు రావని... మనం త్యాగంతో పాటు జోష్తో పనిచేయాలని కేడర్ కు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మేకు అండగా ఉంటానని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా అంతటా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా పథకాలు అమలు చేయలేదని.. కార్యకర్తలు మన పథకాలు అమలవుతున్నయా లేవా అని చూడాలని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మనం చేస్తున్న వాటిని చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. మీకు కావాల్సిన వాటిని ముఖ్యమంత్రిని అడిగి చేస్తానని హామీ ఇచ్చారు.