
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.. మంగళవారం ( జూన్ 10 ) ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.సీఎం రేవంత్ కు బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఇటీవల వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. సోమవారం ( జూన్ 9 ) ఢిల్లీలో బిజీ బిజీగా గడిపిన మంత్రి వివేక్ మల్లికార్జున ఖర్గే వంటి పలువురు పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. తన తండ్రి కాకా వెంకటస్వామి బాటలో నడుస్తానని, ఆయన నేర్పించిన రాజకీయ విలువలు పాటిస్తూ ముందుకు వెళ్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
మంత్రి హోదాలో సోమవారం తొలిసారి వివేక్ ఢిల్లీకి వచ్చారు. తన భార్య సరోజ, కుమారుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిశారు. మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వంశీకృష్ణతో కలిసి వివేక్ మీడియాతో మాట్లాడారు. తనకు ఏ శాఖ అప్పగించినా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా పని చేస్తానని ఆయన చెప్పారు. తనకు అప్పగించిన శాఖ ఏదన్నది చూడకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని తెలిపారు. ‘‘శాఖల కేటాయింపు సీఎం పరిధిలో ఉంటుంది. ఆయన నాకు ఏ శాఖ కేటాయించినా సమ్మతమేనని అన్నారు.
నా తండ్రి కాకాకు గతంలో రూరల్ డెవలప్మెంట్ శాఖ కేటాయిస్తే.. రూ. 5 వేల కోట్ల బడ్జెట్ ఉన్న చిన్న శాఖ అని అందరూ కామెంట్ చేశారు. కానీ ఆ శాఖ బడ్జెట్ను రూ. 5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్లు ఇప్పించారు. సింగరేణి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి సంస్థను కాపాడారు. నేను కూడా నా తండ్రి అడుగుజాడల్లో నడిచి.. ఎంపీగా ఉన్నప్పుడు మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాను. ఇందుకోసం నాటి ప్రధాని మన్మోహన్తో మాట్లాడి రూ. 10 వేల కోట్ల రుణమాఫీ చేయించాను. అలా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలకు ఏం చేశామన్నదే మాకు ముఖ్యం” అని పేర్కొన్నారు.