జులై 15లోగా మెదక్ జిల్లా కార్యవర్గం పూర్తి చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

జులై 15లోగా మెదక్ జిల్లా కార్యవర్గం పూర్తి చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మంత్రులు వివేక్ వెంకటస్వామి,పొన్నం ప్రభాకర్ ఆదేశం
  • ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 15లోగా మెదక్ జిల్లా కార్యవర్గ నియామకాలు పూర్తిచేయాలని ఆ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ పార్టీ నేతలను ఆదేశించారు. మెదక్ జిల్లా కీలక నేతలు, పీసీసీ నియమించిన పార్లమెంట్ ఇన్​చార్జ్​లు, జిల్లా అబ్జర్వర్లతో ఇద్దరు మంత్రులు మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల15లోగా గ్రామ, మండల, జిల్లా కొత్త కార్యవర్గాల నియామకాలను పూర్తి చేయాలని మంత్రులు వివేక్, పొన్నం ఆదేశించారు. 

ఇప్పటికే గ్రామ, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గానికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, జిల్లా అబ్జర్వర్ల సమక్షంలో పీసీసీ జిల్లా ఇన్​చార్జ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ చేయాలన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మహిళలకు పెద్దపీట వేయాలని సూచించారు. సామాజిక సమీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నూతన కార్యవర్గంలో అవకాశం కల్పించాలన్నారు. 

పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 3 డీసీసీల పరిధిలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈ నెల11 తర్వాత పర్యటిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కీలక నేతలు, 10 నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు, అబ్జర్వర్లతో బుధవారం మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, ఆంజనేయులు గౌడ్, పార్టీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జ్​లు, పీసీసీ ఉపాధ్యక్షులు నవాబ్ ముజాయిద్ అలంఖాన్, బండి రమేశ్, జనరల్ సెక్రటరీలు జగదీశ్వర్ గౌడ్, దార సింగ్, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.