చిన్నప్పటి స్నేహం కాస్త ప్రేమ అయ్యింది. చివరకు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. నిండా 18 ఏళ్లు కూడా నిండని వారి ప్రేమపెళ్లి ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు చేరింది. కారణం వారిద్దరూ బాలికలు అవడమే. జార్ఖండ్లోని ధన్బాద్ ప్రాంతంలో సుగాయ్దిహ్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో అది తప్పని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఇద్దరు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రం చూసిన ఆమె తల్లి ప్రశ్నించింది. తాళి ఎవరు కట్టారని ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే సరాయిధేలా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. 18 ఏళ్లు నిండకపోవడంతో ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉండమని , వివాహ వయసు దాటాక మీ ఇష్టమని తాత్కాలికంగా చెప్పి పంపారు పోలీసులు. వారి మనసుల మాదిరి వారిద్దరి పేర్లు కూడా ఒకటే. వారి ఇద్దరి పేర్లు పూజ కావడం గమనార్హం.