
సోషల్ మీడియా రాను రాను మనిషిని పాతాళానికి తొక్కేస్తోంది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొంతమంది. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా పిచ్చి పీక్స్ చేరింది. ఇటీవల హైదరాబాద్ లో ప్రేమను అడ్డుకున్నందుకు మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి ఏకంగా తన తల్లినే హత్య చేసిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. రీల్స్ చేసేందుకు ఐఫోన్ కోసం ఓ వ్యక్తిని గొంతు కోసి.. రాయితో తల పగలకొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. జూన్ 20న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
బెంగళూరుకు చెందిన షాదాబ్ అనే 19 ఏళ్ళ యువకుడు తన బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు ఉత్తర్ ప్రదేశ్ లోని నాగౌర్ గ్రామానికి వెళ్ళాడు. ఈ క్రమంలో షాదాబ్ దగ్గర ఉన్న ఐఫోన్ కోసం.. ఇద్దరు మైనర్లు అతని గొంతు కోసి, రాయితో తల పగలకొట్టి దారుణంగా హత్య చేశారు. షాదాబ్ మృతదేహం సమీపంలోని బావి దగ్గర లభించింది. షాదాబ్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
మంచి క్వాలిటీతో రీల్స్ చేసేందుకు ఐఫోన్ కోసం షాదాబ్ ను హత్య చేశామని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు మైనర్లు. హత్యకు నాలుగురోజుల ముందే స్కెచ్ వేశామని తెలిపారు మైనర్లు. రీల్స్ చేసేందుకని చెప్పి నమ్మించి షాదాబ్ ను ఊరి బయటకు తీసుకెళ్లి.. అతని చంపేశామని ఒప్పుకున్నారు మైనర్లు. కత్తితో గొంతు కోసి, రాయితో తల పగలకొట్టి హత్య చేశామని మైనర్లు అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. హత్య చేసిన ఇద్దరు మినర్లతో సహా ఆధారాలు మాయం చేసేందుకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.