నలుగురికి చీరలు పంచిపెడ్తే ఓట్లేయాలా..కావాలంటే నేను చీరలు ఇస్తా

నలుగురికి చీరలు పంచిపెడ్తే ఓట్లేయాలా..కావాలంటే నేను చీరలు ఇస్తా


మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు. మహిళలకు చీరలే కావాలంటే తాను కూడా ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో తాము వేసిన రోడ్లపై ఇతర పార్టీల నేతలెవరూ నడవొద్దని హెచ్చరించారు. మిర్యాలగూడలో  అధికారులంతా  తన చెప్పు చేతల్లోనే వుంటారని చెప్పారు. గత ఎన్నికల్లో తాను 30 వేల మెజార్టీతో గెలిచానని..కేసీఆర్‌ నుంచి  ఎవరూ తనను విడదీయలేరని తెలిపారు. ప్రస్తుతం భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

ఎమ్మెల్యే భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. నర్సాపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన..స్థానిక ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో జరిగిన అభివృద్ది గురించి ఆలోచించాలని సూచించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దన్నారు. నర్సాపూర్ లో ఇతర పార్టీవాళ్లు ఉంటే కేసీఆర్ వేసిన రోడ్డు నడవద్దని హెచ్చరించారు.  రైతు బంధు, పెన్షన్ తీసుకోకుండా ఉండాలన్నారు.