
- కేబినెట్ మంత్రులు, సలహాదారులవి కూడా!
- 2016 మార్చి 25వ తేదీన సీక్రెట్ గా జీఓ?
- ఆ ఒక్క ఏడాదే ఖజానా నుంచి 22.51లక్షలు చెల్లింపులు
- జీతం ఇచ్చి.. ఐటీ కడుతున్న ప్రభుత్వం
- రహస్యంగా ప్రజాధనం దుర్వినియోగం!!
హైదరాబాద్: ఎక్కడైనా ఉద్యోగికి ప్రభుత్వం లేదా పనిచేస్తున్న సంస్థ జీతం ఇస్తుంది. దానిపై కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను విధిస్తుంది. కానీ కేసీఆర్ గవర్న్ మెంట్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు జీతం ఇవ్వడంతోపాటు వారు కట్టాల్సిన ఐటీని కూడా ప్రభుత్వమే కట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోసం బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ సర్కారు ఏకంగా ఓ జీవోనే జారీ చేసింది. ఆ జీవోను రహస్యంగా ఉంచడం గమనార్హం. 2016 మార్చి 25వతేదీన జీఓ ఆర్టీ నంబరు 917 ను రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దీని ప్రకారం ప్రజాధనంతో సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనాన్ని వెచ్చిస్తూనే ఉన్నారు. నిధుల కొరతతో నీరసించినా.. సీఎం, మంత్రులు, సలహాదారుల ఐటీ మాత్రం ప్రభుత్వం కడుతూనే ఉంది. 2015-16 వ సంవత్సరానికి గాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి సలహాదారులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆదాయపు పన్ను కింద రూ.22.51లక్షలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ చెల్లించింది.
అప్పటి సీఎం కేసీఆర్ ఐటీ రూ.15.39 లక్షలు
2016వ సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆదాయపు పన్ను కింద రూ. 15.39 లక్షలు వెచ్చించారు.అప్పటి ప్రభుత్వ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు రూ.79 వేలు, ఏకే గోయల్ రూ.2.5 లక్షలు, ఎం రామ లక్ష్మణ్ కు రూ.93వేలు, బీవీ పాపారావుకు రూ.24వేలు, కేవీ రమణాచారికి రూ. రూ.27 లక్షలు, జీఆర్ రెడ్డికి రూ.75 వేలు, అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఐటీ చెల్లింపులకు రూ. 1.6 లక్షల ప్రజాధనాన్ని రాష్ట్రప్రభుత్వం వెచ్చించింది.
పొరుగు రాష్ట్రాల్లో సొంత డబ్బులే..
ఇతర రాష్ట్రాల్లో సీఎం, మంత్రులు, సలహాదారుల ఐటీ చెల్లింపులు ప్రజాధనంతో చేయడం లేదు. తెలంగాణలోనే ఇది ఇంప్లిమెంట్ కావడం గమనార్హం. మంత్రుల ఐటీ చెల్లింపులు చేయరాదని హర్యానా, మధ్య ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు నిర్ణయించాయి. దీంతో మంత్రులు, సీఎం వారి ఐటీని వారి సొంత డబ్బుతో చెల్లిస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వ్యర్థం కావడం లేదు. దీనిపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది