న్యూఢిల్లీ : ఇండియా విమెన్స్ వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్.. రిటైర్మెంట్పై తన మనసులో మాటను బయటపెట్టింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్కప్ తర్వాత 23 ఏళ్ల తన క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెబుతానని మిథాలీ వెల్లడించింది. విమెన్స్ క్రికెట్లోనే ఐకానిక్ ప్లేయర్ అయిన మిథాలీ ప్రస్తుతం 38వ పడిలో ఉంది. శనివారం వర్చువల్గా జరిగిన ఓ బుక్ లాంచ్లోపాల్గొన్న మిథాలీ తన కెరీర్, ప్రస్తుత జట్టు గురించి మాట్లాడింది. ‘ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి 21 ఏళ్లు దాటుతోంది. 2022 వరల్డ్కప్ నా చివరి మజిలీ అని నాకు తెలుసు.ఈ చివరి ఏడాది నాకు 20 ఏళ్లతో సమానం. కరోనా వల్ల ప్రస్తుత పరిస్థితులు చాలా టఫ్గా ఉన్నాయి. ఇంటికి పరిమితమైన ఈ టైమ్లో నేను ఫిట్నెస్పై దృష్టి పెట్టా. ఎందుకంటే రోజురోజుకి నా వయసు పెరుగుతుందని నాకు తెలుసు. ఫిట్నెస్ ఇంపార్టెన్స్ కూడా తెలుసు. వరల్డ్కప్ కంటే ముందు మేము ఓ రెండు, మూడు సిరీస్లు ఆడబోతున్నాం. వాటికోసం మెంటల్గా, ఫిజికల్గా సిద్ధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇక నుంచి ఆడబోయే ప్రతీ సిరీస్ మాకు చాలా కీలకం. అంతేకాక వరల్డ్కప్ కోసం తగిన టీమ్ను సిద్ధం చెయ్యాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. అయితే, మ్యాచ్ల కోసం జట్టులో అమ్మాయిలు ఎదురుచూస్తున్న విధానం, బరిలోకి దిగేందుకు వారు పడుతున్న తపన చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తోంది. వరల్డ్కప్ నేపథ్యంలో మేము పేస్ బలం పెంచుకోవాల్సి ఉంది. న్యూజిలాండ్ పిచ్లను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను సిద్ధం చేసుకోవాలి’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.
కోహ్లీ సేనను చూసి నేర్చుకోండి: సన్నీ
ఇండియా విమెన్స్ టీమ్ ప్రత్యర్థికి భయపడకుండా ఎలా ఆడాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సూచించాడు. మిథాలీతోపాటు గావస్కర్ కూడా ఈ వర్చువల్ బుక్ లాంచ్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. ‘లార్డ్స్ వేదికగా జరిగిన 2017 విమెన్స్ వరల్డ్కప్ ఫైనల్లో నేను ఓ విషయం గమనించా. ఇంగ్లిష్ అమ్మాయిలు.. మన ప్లేయర్ల ముందు తమ యాటిట్యూడ్ చూపించారు. కళ్లలోకి కళ్లు పెట్టి చూసి కవ్వించారు. ఇండియన్ ప్లేయర్లు మాత్రం బదులు చెప్పుకుండా తల దించుకుని నిలబడ్డారు. అలా కాకుండా మనోళ్లు కూడా ప్రత్యర్థికి బదులు చెప్పాలని నేను కోరుకుంటున్నా. ప్రత్యర్థులను విరాట్ కోహ్లీ ఎలా నొక్కినొక్కి చూస్తాడో ఓసారి చూడండి. కోహ్లీ అలా చేస్తుండటంతో మిగిలిన టీమ్ కూడా అదే ఫాలో అవుతోంది’ అని అన్నాడు.