
నిర్మాత బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎం ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ రూపొందిస్తున్నాడు.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ రాగా, గురువారం రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం నవ్వులు పంచుతూ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు అనుదీప్ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్కు బెస్ట్ విషెస్ను అందించారు. నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని నిర్మాత బన్నీ వాస్ అన్నారు.
ఈ మూవీ టీజర్కు మించి ఎన్నో రెట్లు వినోదాన్ని పంచుతుందని ప్రియదర్శి చెప్పాడు. ఇంత మంచి సినిమా తన మొదటి తెలుగు చిత్రం కావడం సంతోషంగా ఉందని నిహారిక చెప్పింది. ఈ చిత్రం అందర్నీ అలరించేలా ఉంటుందని దర్శక నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.