- పర్సనల్ ఫొటోలను మొబైల్కు పంపిస్తూ బ్లాక్ మెయిల్
- ఏపీలోని కోనసీమ జిల్లాలో బాధితురాలి ఆత్మహత్యాయత్నం
- జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్థానిక పోలీసులు
- సిటీలోని మధురానగర్ పీఎస్కు కేసు బదిలీ
హైదరాబాద్, వెలుగు: ఏపీకి చెందిన ఓ యువతికి పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియో తీసి.. వాటిని పంపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన యువతికి(28) అదే జిల్లా పి. నాయకంపల్లె, అంగార గ్రామాలకు చెందిన జాషువా, నర్సింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు బంధువుల ద్వారా పరిచయమయ్యారు. యువతి ఆ ఇద్దరితో కలిసి పబ్జీ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఆ యువతి జాషువా ప్రేమించుకున్నారు. 2020లో పెండ్లి చేసుకున్నారు. యువతి తనకు దక్కలేదని కోపంతో నర్సింహామూర్తి ఆమెపై కోపం పెంచుకున్నాడు.
యువతికి, ఆమె భర్త జాషువాకు మధ్య గొడవలు జరిగేలా చేశాడు. దీంతో బాధితురాలు భర్తతో విడాకులు తీసుకుంది. కొంతకాలం తర్వాత జాబ్ కోసం సిటీకి వచ్చింది. ఆమె బల్కంపేటలో ఉండగా.. నర్సింహామూర్తి సైతం సిటీకి వచ్చి జవహర్నగర్లోని మల్లన్నగుట్టలో ఉన్నాడు. వీరిద్దరూతరచూకలుసుకునేవారు. 2 నెలల కిందట నర్సింహామూర్తి యువతి ఉంటోన్న ఇంటికి వచ్చాడు. మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ను ఆమెకు ఇచ్చాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమె సెల్ ఫోన్కు పంపించి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు ఏపీలోని సొంతూరికి వెళ్లిపోయింది. అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు ఫైల్ చేశారు. బాధితురాలి కంప్లయింట్ ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచార ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగినందున కేసును ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు.