బియ్యం దందాతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బియ్యం దందాతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • చట్ట విరుద్ధమైన పనులకు వ్యతిరేకం
  •  ప్రజలకు క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటా
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా: చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు ప్రారంభించారు. వారితోపాటు కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చట్ట విరుద్ధమైన పనులకు తానెప్పుడూ వ్యతిరేకమేన, ఆయన పేరు చెప్పి దందాలకు పాల్పడితే సహించనని వివేక్ వెంకట స్వామి హెచ్చరించారు. కుటుంబ సమేతంగా పూజ చేసి క్యాంప్ ఆఫీస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటానని, క్యాంప్ ఆఫీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో బియ్యం, లిక్కర్, ఇసుక, ల్యాండ్ మాఫియా దందాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. 


ఈజీఎస్ క్రింద ఇసుకను తరలించేందుకు ఆయనపేరును వాడుకుంటున్న వారిని హెచ్చరించారు. తాను అలాంటి వాటికి ఎవ్వరిని ప్రోత్సహించనని, సర్కారు నిబంధనల ప్రకారమే అందరూ నడుచుకోవాలని ఆదేశించారు. బియ్యం దందాకు వివేక్ వెంకటస్వామికి సంబంధం ఉందని బదునం చేస్తూ, తప్పుడు వార్తలు రాస్తున్నారని ఖండించారు. పర్మిషన్ లేకుండా వాహనాలను వెంటనే సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇనుప కంచెలను తొలగించి ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజా పాలన తీసుకువచ్చారని  చెన్నూరు ఎమ్మెల్యే అన్నారు.