నా పోరాటం కేసీఆర్‌‌‌‌ని గద్దె దింపడమే!

నా పోరాటం కేసీఆర్‌‌‌‌ని గద్దె దింపడమే!

మునుగోడు, వెలుగు: నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌ను గద్దె దించే వారితో కలిసి పని చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అన్న వెంటే తమ్ముడన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, తన పోరాటం కేసీఆర్‌‌‌‌ని గద్దె దింపడం కోసమేనన్నారు. శనివారం నల్గొండ జిల్లా చండూరులోని కొండాపురంలో సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా టీఆర్ఎస్‌‌ను బొంద పెట్టడానికి, తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకేనన్నారు. పార్టీ మారాలన్నా నిర్ణయాన్ని మునుగోడు ప్రజల సమక్షంలోనే తీసుకుంటానన్నారు. ఎందరోబలిదానాలు చేసుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, కానీ కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నాయకులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. మరో 20 రోజుల్లో పంట చేతికి వచ్చే వరి చేన్లకు కరెంటు కోత పెట్టారని, రైతుల నోటికాడి బువ్వను నేలపాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం వడ్లను కొనాలని ధర్నాలు చేసిన సీఎం కేసీఆర్.. వడ్లను కొంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మరి ధర్నాలు దేనికోసం చేశారో చెప్పాలని రాజగోపాల్‌‌రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం.. మునుగోడు నియోజకవర్గంలోని చర్లగూడెం, ఉదయసముద్రం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో లబ్ధిదారులకు సర్పంచులు, అధికారులు ఇవ్వాల్సిన కల్యాణ లక్ష్మి చెక్కులను, మంత్రి జగదీశ్​రెడ్డి పంపిణీ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మునుగోడును అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని అన్నారు