ఎమ్మెల్సీ పల్లా పార్టీని ధిక్కరించిండు : ముత్తిరెడ్డి

ఎమ్మెల్సీ పల్లా పార్టీని ధిక్కరించిండు : ముత్తిరెడ్డి
  • పల్లా పార్టీని ధిక్కరించిండు
  • జనగామలో వర్గాలను ప్రోత్సహిస్తున్నడు: ముత్తిరెడ్డి
  • ఎమ్మెల్యే లేకుండా నియోజకవర్గ ప్రజలతో మీటింగ్​ పెట్టడంపై అభ్యంతరం

జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గ కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి నిడిగొండలో మీటింగ్​పెట్టి పార్టీని ధిక్కరించాడని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గతంలో మీటింగ్​కు ఏర్పాట్లు చేసుకుంటే అధిష్టానం మందలించడంతో వెనుదిరిగాడని మళ్లీ ఇప్పుడు అక్కడే మీటింగ్​పెట్టి తప్పు చేశాడని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో శనివారం సాయంత్రం ముత్తిరెడ్డి నియోజకవర్గ లీడర్లతో సమావేశమయ్యారు.

జనగామ బరిలో ఎవరుండాలనే విషయంపై వారి నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లీడర్లంతా ముత్తిరెడ్డే ఉండాలని చెప్పారు. కేసీఆర్​ టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జనగామ ఎమ్మెల్యే లేకుండా జనగామ కార్యకర్తలతో పల్లా మీటింగ్​పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానం గమనిస్తోందని, టికెట్​ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ లీడర్లు తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు, లీడర్ల మనోభావాలను కేసీఆర్​పరిగణనలోకి తీసుకొని తనకే టికెట్​కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్​అని, అప్పటిదాక పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేయొద్దన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు మధ్యలో ఉన్నాయని, గెలిస్తే అన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్​చైర్​పర్సన్​పోకల జమున, మార్కెట్​కమిటీ చైర్మన్​బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ వైస్​చైర్మన్​ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.